Watch Video: వానకు కొట్టుకుపోతున్న పంటను కాపాడుకోవడానికి ఈ రైతు ఆరాటం చూశారా? గుండె తరుక్కుపోయే ఘటన.. వీడియో

Watch Video: వానకు కొట్టుకుపోతున్న పంటను కాపాడుకోవడానికి ఈ రైతు ఆరాటం చూశారా? గుండె తరుక్కుపోయే ఘటన.. వీడియో


ఆరుగాలం కష్టించి ఎండెనక.. పగలురాత్రెనక చమటొడ్చి పండించిన పంట.. అమ్ముకుందామని మార్కెట్‌కు తీసుకొస్తే అనుకోకుండా వానొచ్చింది. చూస్తుండగానే చినుకులు జడివానై నీరు ఏరులై పారింది. అంతలో కుప్పగాపోసిన తన పంట.. తన కష్టార్జితం.. కళ్లముందే వాన నీరు తోసుకుంటూ పోతుంది. పంట మొత్తం వానదేవుడు కనికరం లేకుండా నీళ్లతోపాటు తీసుకెళ్తుంటే ఆ రైతు గుండె విలవిలలాడింది. అంతే.. వానకు ఎదురొడ్డి, వరద నీటికి అడ్డుపడ్డాడు. అయినా జడివాన నీటిని తన రెండు చేతులు ఆపలేకపోయాయి. అయినా మనసూరుకోక వాన నీటితో పోటీ పడుతూ తన పంట కోసం జోరుగా కురుస్తున్న వానలో అటూఇటూ పరుగులు తీయసాగాడు. వాన నీటిలో కొట్టుకు పోతున్న తన పంటను కాపాడు కోవడానికి ఆ రైతు ఆరాటం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్‌ పన్వార్‌ సాగు చేసిన తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి దగ్గరల్లోని వాషిమ్‌ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. అంతలో భారీ వర్షం కురవడంతో పంట మొత్తం నీటిలో కొట్టుకొని పోసాగింది. దీంతో రైతు గౌరవ్‌ భారీ వర్షంలో తడుస్తూనే వాన నీటికి అడ్డుపడి పంటను కాపాడుకోవడానికి కొట్టుకుపోతున్న వేరుశనగను శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ ఎంత తాపత్రయపడినా వాననీటి జోరు ముందు ఓడిపోయాడు. పన్వర్ తన చేతులతో నీళ్లలో కొట్టుకుపోతున్న తన పంటను కాపాడటానికి నిస్సహాయంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మిగతా వారంతా వానకు పక్కనే ఉన్న షెడ్డులో నిలబడి చోద్యం చేస్తున్నారే తప్ప ఎవరూ సాయమందించలేదు. ఈ హృదయవిదారక వీడియో చూస్తే ఎవరి గుండె అయినా తరుక్కుపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం కాస్తా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దృష్టికి వెళ్లడంతో.. ఆయనే బాధిత రైతుకు ఫోన్‌ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇది (వీడియో) నన్ను బాధించింది. కానీ చింతించకండి. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్య పట్ల చాలా సున్నితంగా ఉంటుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర వ్యవసాయ మంత్రితో మాట్లాడాను. కలెక్టర్‌తో కూడా మాట్లాడాను. మీకు, మీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నష్టాన్ని భర్తీ చేస్తాం. సోమవారం నాటికి సమస్యను పరిష్కరించడానికి వారు ప్రయత్నిస్తారు. మేమంతా మీతోనే ఉన్నాం’ అని కేంద్ర మంత్రి చౌహాన్ రైతుకు భరోసా కల్పించారు. ఇక వర్షంలో తడిసిపోవడం వల్ల తాను అనారోగ్యంగా ఉన్నానని పన్వర్ మంత్రికి చెప్పాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *