భారీ వర్షాలు ఉత్తర భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఝార్ఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఝార్ఖండ్ తూర్పు సింగ్భమ్ జిల్లాలో శంకు నదిలో ఒక యువకుడు చిక్కుకుపోయాడు. ఒక చెట్టుపై చిక్కుకుపోయిన అతన్ని సమీప గ్రామస్థులు కాపాడారు. భారీ వర్షంతో ఓ ఆశ్రమ పాఠశాల వరదనీటిలో మునిగింది. దాంతో.. 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకోగా స్థానికులు తాడు సాయంతో రక్షించారు.
హిమాలచల్ ప్రదేశ్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సిమ్లాలో ఒక పాత ఐదంతస్థుల భవనం కూలిపోయింది. భవనంలో ఉన్నవాళ్లను ముందే ఖాళీ చేయించడంతో ముప్పు తప్పింది. మండిలో బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత పది రోజుల్లో హిమాచల్ప్రదేశ్లో వర్షాలకు 20 మంది చనిపోయారు. మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది.
బిహార్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. బిహార్లోని గయాజీలో కొండపై ఉన్న జలపాతం దగ్గర నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. ఊహించని వరద ప్రవాహంతో పర్యాటకులు చిక్కుకుపోయారు. కొందరు చెట్లను పట్టుకుని కాపాడమంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు నీటి మధ్యలో కొండ రాళ్లపై చిక్కుకుపోయారు. గోపాల్గంజ్లోని ఆస్పత్రిలోకి వరద నీరు చేరడంతో రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.