హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సమీపంలోని భూముల్లో చెట్లను నరికివేడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. చెట్లను నరికివేయొద్దని జేసీబీలకు అడ్డంగా వెళ్లి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య తీవ్ర వివాధం నెలకొంది. అప్పుడు పోలీసులు విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఈ వివాదం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఐటీపార్క్ అభివృద్ధి కోసం చెట్లను నరికివేయండం సరికాదని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై తాజాగా మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లను నరికారు, అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని కోర్టు వ్యాఖ్యానించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
జూలై 23 కల్లా ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించకపోతే సీఎస్ సహా కార్యదర్శులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. తదరుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..