Shubman Gill : టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ ఆసియా కప్ 2025 టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా మారింది. జట్టును ఎంపిక చేయాల్సిన సెలెక్టర్లు గిల్ను ప్లేయింగ్-11లో ఎక్కడ చేర్చాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. భారత జట్టు మేనేజ్మెంట్ ప్రకారం.. ప్రస్తుతానికి గిల్ టీ20 ఫార్మాట్ వ్యూహానికి సరిపోడని భావిస్తున్నారు. అందుకే, గిల్ను దుబాయ్కి పంపించే అవకాశం లేదని తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత జట్టులో మార్పులు లేకుండా, ఇప్పటికే ఎంపిక చేసుకున్న ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది.
ఆగస్టు 19న జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశానికి ముందు, ఈ పరిస్థితి గురించి బీసీసీఐ అధికారులకు తెలియజేయనున్నట్లు సమాచారం. ఇటీవల గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియా కెప్టెన్గా కొనసాగనున్నారు. సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు జరిగిన అనధికారిక చర్చల్లో గిల్ ఎంపికపై తీవ్రంగా చర్చ జరిగింది. గిల్ను జట్టులో చేర్చుకోవాలంటే, అతడిని ఓపెనర్గా ఆడించాల్సి వస్తుంది. అయితే, అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ ఓపెనింగ్లో బాగా రాణిస్తున్నందున, వారిని మార్చడం మేనేజ్మెంట్కు ఇష్టం లేదు.
మరొక సవాలు ఏంటంటే, గిల్ను జట్టులో చేర్చాలంటే తిలక్ వర్మను పక్కన పెట్టాలా అని కూడా చర్చించారు. కానీ, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న తిలక్ను పక్కన పెట్టడం అన్యాయమని జట్టు మేనేజ్మెంట్ భావించింది. దీంతో గిల్ను జట్టులో చేర్చి, బెంచ్కే పరిమితం చేయడం సరైనది కాదని నిర్ణయించుకున్నారు.
బీసీసీఐలోని ఒక వర్గం ప్రకారం.. “గిల్ను జట్టులోకి తీసుకుంటే, అతను నేరుగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావాలి. ఒకవేళ అతడికి మ్యాచ్లలో అవకాశం ఇవ్వకపోతే, జట్టులో ఉంచడంలో అర్థం లేదు. అదే సమయంలో గతంలో బాగా రాణించిన సంజు సామ్సన్కు కూడా అన్యాయం చేసినట్టవుతుంది. గిల్ను తీసుకుంటే, సంజు లేదా జితేష్ శర్మలలో ఒకరు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది” అని తెలిపారు.
టీమ్ ఇండియా మేనేజ్మెంట్, సెలెక్టర్లు యశస్వి జైస్వాల్ను మూడో ఓపెనర్గా ఎంపిక చేయాలని చూస్తున్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో జైస్వాల్ ఉన్నప్పటికీ, అతడికి ఒక మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. అయితే, జైస్వాల్ స్థానంలో గిల్ను తీసుకుందామా అని చర్చించినప్పటికీ, ఆ ఆలోచనను పక్కన పెట్టారని తెలుస్తోంది. గిల్ చివరిసారిగా జూలై 2024లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్లతో జరిగిన టీ20 సిరీస్లలో గిల్కు చోటు దక్కలేదు.
అయితే, ఇటీవల టెస్ట్ క్రికెట్లో గిల్ అద్భుతంగా రాణించడంతో, అతడిని అన్ని ఫార్మాట్ల కెప్టెన్గా నియమించాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ, సెలెక్టర్లు ఇంగ్లాండ్పై సాధించిన విజయం ఆధారంగా తొందరపడకుండా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..