
ఐపీఎల్ 2025లో తొలిసారిగా ట్రోఫీని అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 ఐపీఎల్ సీజన్లలో ఆర్సీబీకి ఇదే మొదటి ట్రోఫీ. ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఈ అంశంపై మరోసారి ఆర్సీబీపై కౌంటర్ వేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలవాలంటే కచ్చితంగా 72 సంవత్సరాలు పడుతుందని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.
ఇటీవల శుభంకర్ మిశ్రాతో జరిగిన అన్ఫిల్టర్డ్ పాడ్కాస్ట్లో అంబటి రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు 18 సంవత్సరాలు పట్టింది. మరో ఐదు ట్రోఫీలు గెలవాలంటే 72 సంవత్సరాలు పడుతుందంటూ వ్యంగ్యంగా చెప్పాడు. ట్రోఫీ గెలవడంలో ఆర్సీబీ కొంచెం వేగం పుంజుకోవాలన్నాడు. అంతకుముందు IPL 2025 ప్రారంభంలో అంబటి రాయుడు ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలవదని అంచనా వేశాడు. కానీ RCB ఆ అంచనాలను తారుమారు చేస్తూ మొదటిసారి ట్రోఫీని అందుకుంది.
మొదటిసారి కప్పు గెలవడం సంతోషమే.. కానీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాదిరి 5 ట్రోఫీలను గెలవడానికి ఆర్సిబికి 72 సంవత్సరాలు పట్టవచ్చని చెబుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అంబటి రాయుడు విమర్శించాడు. రాబోయే ఐపీఎల్లో ఆర్సిబి ఫైనల్లోకి ప్రవేశిస్తుందని అంచనా వేశాడు. అయితే, ఫైనల్లో ఆర్సిబి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. గతంలో పలుమార్లు ఆర్సీబీపై వెతకారపు కామెంట్స్ చేశాడు చెన్నై మాజీ ప్లేయర్ అంబటి రాయుడు. RCB జట్టు గెలవడానికి కష్టపడటం తనకు ఎప్పుడూ ఆనందాన్నిస్తుందని కూడా అతడు పేర్కొన్నాడు.