వర్షాలు చక్కగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. డ్యాములు, రిజర్వాయర్లు బేషుగ్గా నిండుతున్నాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రావణమాసం శుభకరంగా ప్రారంభమైంది. ఈ సారి శ్రావణం శుక్రవారంతోనే ప్రారంభం కావడం మరో మంచి శకునం. అంతా శ్రీకరం, శుభకరంగా ఉన్న ఈ శ్రావణమాసంలో చక్కని ముహూర్తాలు కూడా ఉన్నాయి. రేపటి నుంచి మొదలుపెడితే ఆగస్ట్ 17 వరకు.. మళ్లీ ఆగస్ట్ 23 నుంచి 28 వరకు పెళ్లి ముహూర్తాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు పండితులు. అయితే ఓవైపు పెళ్లి ముహూర్తాలు.. ఇంకోవైపు శారీ ఫంక్షన్లు, పంచె కట్టు ఫంక్షన్లు కూడా చాలా పెట్టుకున్నారు. దీంతో శ్రావణమాసంలో వస్త్రదుకాణాలు, జ్వెలరీ షాపులు కళకళలాడబోతున్నాయి.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడే అసలు కథ మొదలుకాబోతోంది. ఈ శ్రావణంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే పెళ్లిళ్లకు బంగారం కచ్చితంగా కొనాల్సిందే. ముహూర్తాలు మించిపోకముందే అన్ని సెట్ చేసుకోవాలి కనుక.. డిమాండ్ కూడా అదే విధంగా పెరిగిపోతుంది. దీంతో ఈసారి శ్రావణంలో బంగారం ధర ఇంకో మైలురాయిని తాకబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
శ్రావణం రాకముందే బంగారం లక్ష దాటింది. దీనికి కారణం అంతర్జాతీయ యుద్ధభయాలే. మిడిలీస్ట్లో వార్, రష్యాఉక్రెయిన్ యుద్ధం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెడద.. ఇలాంటి వాటివల్ల డిమాండ్ పెరిగి బంగారం రేటు పెరిగింది. ఇప్పుడు శ్రావణమాసం కూడా వచ్చేసింది. ఇక్కడితో ఆగదు.. శ్రావణమాసం తర్వాత పండగలున్నాయి. వరలక్ష్మీ వత్రం, శ్రీకృష్ణజన్మాష్టమి, రాఖీ పౌర్ణమి, దసరా, దీపావళి, కార్తీకమాసం అంటూ పండగలు.. పెళ్లిళ్ల సీజన్ భారీగా ఉండబోతోంది. వచ్చే నాలుగైదు నెలల్లో బంగారం మరో పాతిక వేలు పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు
ఇటు మంచి ముహూర్తాలేకాదు.. అటు యుద్ధభయాలు కూడా ఉన్నాయి. ట్రంప్ ఇప్పటికే పుతిన్కు 50రోజుల సమయం ఇచ్చారు. ఆ డెడ్లైన్ ముగిసేలోపు ఆయన దిగిరాకపోతే భీకర యుద్ధం జరిగే అవకాశాలున్నాయి. దీంతో రేటు మరింత ఘాటుగా మారే ప్రమాదం కూడా ఉంది. ట్రంప్ ఇష్టమొచ్చినట్లు సుంకాలు విధించడం వల్ల.. మిగిలిన దేశాలు ఆ భారాన్ని మోయడానికి ఇలా బంగారం, ప్రీమియం వస్తువులపై సుంకాలు పెంచే ప్రమాదం కూడా ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి బంగారం రేటు లక్షా పాతికవేలకు చేరే ప్రమాదం ఉంది. బంగారం రేటు ఒక్కోరోజు ఒక్కోలా ఉంటోంది. అయితే రాబోయే కాలం మరింత కఠినంగా మారబోతోందన్నది వాస్తవం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి