సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాఖా చూపించడానికి రెడీగా ఉన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు గానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంది. పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక.. గాళ్ ఫ్రెండ్, రెయిన్ బో లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో రానున్నారు. వీటితో పాటు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.
సమంత సైతం చాలా రోజుల తర్వాత టాలీవుడ్పై ఫోకస్ పెంచేసారు. నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం మొన్న మే 9న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగానే తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు స్యామ్. కథల కోసం చూస్తున్నట్లు తెలిపారు. సొంత ప్రొడక్షన్లో చేస్తున్న మా ఇంటి బంగారం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
నయనతార రేసులో లేనట్లే కనిపిస్తారు గానీ ఈమె వస్తే మిగిలిన హీరోయిన్స్ అంతా సైడ్ ఇవ్వాల్సిందే. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తున్నారు.. ఈ సినిమా కోసం 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే చెప్తుంది నయన్ రేంజ్ ఏంటనేది..? రెండేళ్లకో సినిమా చేసినా నయనతార క్రేజ్ అలా ఉంటుంది మరి.
త్రిష కూడా తెలుగులో బిజీగానే ఉన్నారు. చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. దాంతో పాటు మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.
ఇక మృణాళ్ ఠాకూర్ కాస్త గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ సినిమా ఫైనల్ చేసారు. వీళ్ళతో పాటు అనుష్క ఘాటీతో కమ్ బ్యాక్ ఇవ్వనున్నారు. మొత్తానికి సీనియర్ హీరోయిన్స్ అంతా సాలిడ్ కమ్ బ్యాక్ ప్లాన్ చేస్తున్నారు.