పేరుకు హాలీవుడ్ మేకర్ అయినా.. ఇండియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈయన చేసిన టైటానిక్, అవతార్ సినిమాలు మన రీజినల్ బ్లాక్ బస్టర్స్ రేంజ్లో వసూళ్లు సాధించాయి. రెండేళ్ళ కిందట రిలీజ్ అయిన అవతార్ 2 ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.
కామెరూన్ సినిమాలు ఇండియన్స్కు అంతగా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్, ఆయన ఎంచుకునే కథలే. ఇండియన్ మైథాలజీ నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్, క్యారెక్టర్ డిజైన్స్తోనే సినిమాలు చేస్తుంటారు ఈ హాలీవుడ్ లెజెండ్.
మరీ ముఖ్యంగా అవతార్ సిరీస్ చూస్తే పంచ భూతాలే ఈ కథలకు స్ఫూర్తి అనిపిస్తుంది. మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేసారు జేమ్స్. అవతార్ 2 అంతా వాటర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు.
ఇప్పుడు మూడో భాగానికి నిప్పును నేపథ్యంగా ఎంచుకున్నారు. ఫైర్ అండ్ ఆష్ అనే ట్యాగ్ లైన్తో రెడీ అవుతోంది అవతార్ 3. జ్వాలా ద్వీపంలో జరిగే యుద్ధాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు.
ఈ పార్ట్లో కొన్ని కొత్త తెగలు పరిచయం చేయబోతున్నారు. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ గతంలోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అవతార్ తొలి రెండు భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ 3లో ఉంటాయన్న హింట్ ట్రైలర్తో ఇచ్చారు.
దీనికోసం సరికొత్త టెక్నాలజీ వాడుతున్నారు. గతంలో వచ్చిన రెండు సినిమాలతో పోలిస్తే మరింత థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు ఎమోషనల్ కంటెంట్తో డిసెంబర్ 19న రిలీజ్కు రెడీ అవుతోంది అవతార్ 3.