
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు విజయవాడ సిట్ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిట్ అధికారులకు మిథున్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. విచారణకు హాజరైతే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. శుక్రవారం సుప్రీంకోర్టులో, మంగళవారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో సిట్ కార్యాలయానికి రానున్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో ఏ4గా మిథున్ రెడ్డి ఉన్నారు.
లిక్కర్ కేసులో 11మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు…220 మందిని విచారించిన తర్వాత, కీలక ఆధారాలు సేకరించారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో కర్త, కర్మ, క్రియ రాజ్ కేసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినా.. పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తోంది. సుమారు 3వేల 500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ చెబుతోంది. డిస్టిలరీల నుంచి లిక్కర్ ఆర్డర్స్ తీసుకోవడం నుంచి ముడుపుల వసూళ్ల వరకు.. తెర వెనుక కథను మిథున్ రెడ్డే నడిపారని సిట్ ఇప్పటికే హైకోర్టు, ఏసీబీ కోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఏ4గా మిథున్రెడ్డి ఉన్నారు.
మరోవైపు AP లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈనెల 21వ తేదీన సిట్ కార్యాలయంలో 10 గంటలకు విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి నారాయణ స్వామికి సూచించింది. వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు నారాయణ స్వామి. జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎన్నికై ఎక్సైజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు నారాయణ స్వామి.