దుబాయ్ వేదికగా మరో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది టీవీ9 నెట్వర్క్. గతేడాది జర్మనీలో జరిగిన మొదటి సదస్సుకు కొనసాగింపుగా ఇవాళ UAE గ్లోబల్ సమ్మిట్ను ఆర్గనైజ్ చేస్తోంది. న్యూస్9 – గ్లోబల్ సమ్మిట్లో భారత్ – యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, ప్రముఖులు, ఇన్ఫ్లూయెన్సర్లు పాల్గొననున్నారు. అనేక అంశాల్లో భారత్ – యూఏఈ భాగ్యస్వామ్యంపై దృష్టిపెట్టనుంది టీవీ9 గ్లోబల్ సమ్మిట్. భారత్లో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్గా ఉన్న టీవీ9 ఆధ్వర్యంలో జరుగుతోన్న న్యూస్9 – యూఏఈ గ్లోబల్ సమ్మిట్లో ఇరు దేశాల అభివృద్ధి, సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందాలు, ఇండియా-మిడిలీస్ట్-యూరప్ కారిడార్, టారిఫ్ ఛాలెంజ్లు, స్టార్టప్లు, ఏఐ, సాంస్కృతిక అనుసంధానంపై చర్చిస్తారు. ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఉన్నతస్థాయి ప్యానెల్ చర్చలు జరుగుతాయి.
న్యూస్9 – యూఏఈ గ్లోబల్ సమ్మిట్లో బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్శెట్టి, టెలీ సీరియల్స్ నిర్మాత ఏక్తాకపూర్, నటి నర్గీస్ ఫఖ్రీ హాజరుకానున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ సమ్మిట్లో పాలుపంచుకోనున్నారు. కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రి హర్దీప్సింగ్ పూరీ కీలకోపన్యాసం ఇస్తారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ కూడా ఇరు దేశాల భాగస్వామ్య సంబంధాలపై ప్రసంగిస్తారు. రెండు దేశాల ఆధ్యాత్మిక సంబంధాలపై మాట్లాడతారు స్వామినారాయణ్ సంస్థ స్వామీజీ బ్రహ్మవిహారి.
కీలక దేశాలతో భారత్ వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా న్యూస్9 – గ్లోబల్ సమ్మిట్ సిరీస్ను రూపొందించింది టీవీ9 నెట్వర్క్. అందులో భాగంగా గతేడాది నవంబర్లో జర్మనీ వేదికగా మొదటి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. జర్మనీ సమ్మిట్కు సక్సెస్గానే ఇప్పుడు దుబాయ్ సదస్సు నిర్వహిస్తున్నట్టు టీవీ9 నెట్వర్క్ ఎండీ అండ్ సీఈవో బరున్ దాస్ వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి