చిన్నప్పట్నుంచి కష్టం అంటే ఏంటో తెలీకుండా అల్లారుముద్దుగా పెరిగాడు. అక్క ద్వారా స్ఫూర్తి పొంది పర్వతారోహణను హబీగా మార్చుకున్నాడు. అప్పట్నుంచి కఠోర శిక్షణ తీసుకున్నాడు. ఆపై శిఖరాలను ఎక్కేందుకు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అది ప్రాణాలతో చెలగాటమే. వాటన్నిటినీ సమయస్పూర్తితో, సంయమనంతో అధిగమిస్తూ 16 ఏళ్ల వయసులోనే 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలను విజయవంతంగా అధిరోహించాడు. దీంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇంత చిన్నవయసులోనే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డిప్రెషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెంటల్ స్ట్రెంత్ గురించి చెప్పే మోటివేషనల్ స్పీకర్గానూ ఎదిగాడు.
హైదరాబాద్ బాలానగర్లోని ఫిరోజ్గూడకు చెందిన పడకంటి రాజేందర్ ప్రసాద్-లక్ష్మీ దంపతుల కుమారుడే ఇక్కడ కనిపిస్తున్న విశ్వనాథ్ కార్తికేయ. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుల్లో చురుగ్గా ఉండే కార్తికేయ.. 2020లో పర్వతారోహకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. నార్త్ అమెరికాలోని డెనాలి, యూరప్లోని ఎల్బ్రూస్, ఆఫ్రికాలోని కోసీజ్కో, ఇండియాలోని కాంగ్ఎట్సీ 1, 2, ఫ్రెండ్షిప్ పీక్, నేపాల్లోని ఐస్ల్యాండ్పీక్, సౌత్ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ సహా మొత్తం 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలను అధిరోహించాడు.
తాజాగా జనవరి 22న దక్షిణ అమెరికాలోని 6,961 మీటర్ల ఎత్తైన అకోంకగ్వా శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డు సృష్టించాడు. విశ్వనాథ్ కార్తికేయ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడంతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. పర్వతారోహకులు కలగా భావించే మౌంటే ఎవరెస్టు శిఖరాన్ని సైతం ఈ యువకుడు అధిరోహించాడు. దీంతో 7 ఖండాల్లో 7 ఏత్తైన పర్వతాలు అధిరోహించిన పిన్న వయస్కుడిగా కార్తికేయ చరిత్ర సృష్టించాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..