బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన తేజస్విని అనే విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో ఆశ్చర్యకర పరిణామాన్ని ఎదుర్కొంది. ఐదు సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు సాధించిన ఆమె, సోషల్లో ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి. అన్నింటిలో 90 కి పైగా మార్కులు వచ్చి సోషల్ లో కేవలం 23 మార్కులతో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. టీచర్స్ సహా అందరూ రివాల్యుయేషన్కు అప్లై చేయాలని అందరూ సూచించారు. దీంతో పునఃమూల్యాంకనంలో అప్లై చేసారు.
రివాల్యుయేషన్లో ఆ విద్యార్ధిని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆమెకు అదే సోషల్ సబ్జెక్టులో 96 మార్కులు లభించాయి. ఫలితంగా ఆమె మొత్తం మార్కులు 575కి చేరాయి.
ట్రిపుల్ ఐటీకి చేజారిన అవకాశం
అధికారుల నిర్లక్ష్యంతో మొదట ఫెయిల్ మార్కులు వేయడం, ఆ తర్వాత మళ్లీ రివాల్యుయేషన్లో 96 మార్కులు వచ్చాయి. ఈలోగా ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్కులతో ఆమెకు సీటు వచ్చే అవకాశం ఉందని భావించి, దరఖాస్తు చేసుకునే ప్రత్యేక అవకాశం ఇవ్వాలంటూ ఉపాధ్యాయులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
తండ్రి కూలీ
తేజస్వినిని తండ్రి కూలి. తమ బిడ్డ భవిష్యత్ బాగుండాలని కష్టాలకోర్చి.. తినీతినక ఆమెను చదివిస్తున్నారు. ఆమెకు ట్రిపుల్ ఐటీలో సీట్ లభిస్తే ఆ కుటుంబానికి కొద్దిగా ఊరట లభిస్తుంది. ఇలాంటి నిజమైన ప్రతిభ గల చదువుల తల్లికి మెరుగైన విద్య లభించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..