జైపూర్, మే 26: రాజస్థాన్లోని జైపూర్ సెంట్రల్ జైలులోని రఫిక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే ఐదుగురు ఖైదీలు రెగ్యులర్గా జరిగే హాస్పిటల్ విజిట్ పేరుతో పిక్నిక్ వెళ్లారు. బ్రేక్ టైంలో వాళ్లు హోటళ్లకు సైతం వెళ్లారు. భార్యలు, గర్ల్ఫ్రెండ్స్తో చెట్టాపట్టాల్ వేసుకుని పోహా బ్రేక్ ఫాస్ట్ కూడా చేశారు. ఎస్ఎంఎస్ ఆస్పత్రికి వెళ్లేందుకు మెడికల్ చెకప్ అప్రూవల్ తీసుకున్న ఆ నలుగురు ఆ తర్వాత జైలు అధికారులతో కుమ్మక్కై సిటీ అంతా చక్కర్లు కొట్టారు. సాయంత్రం 5.30 నిమిషాల వరకు ఖైదీల్లో ఒక్కరు కూడా జైలుకు తిరిగి రాలేదు. కేవలం ఒకే ఒక్క ఖైదీ మాత్రమే చెప్పినట్లు జైలుకు వచ్చాడు. ఇలా కొన్ని గంటలు బయట స్వేచ్ఛగా తిరిగేందుకు సదరు ఖైదీలు కానిస్టేబుళ్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున లంచం కూడా ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు ఖైదీలు, నలుగురు బంధువులు సహా మొత్తం 13 మందిని ఆదివారం అరెస్టు చేసినట్లు సోమవారం తెలిపారు. వీరిలో రఫిక్ భార్య నార్కోటిక్స్ మత్తు పదార్ధాలతో పోలీసులకు అడ్డంగా దొరికింది. ఎన్డీపీఎస్ చట్టం కింద ఆమెపై కేసు బుక్ చేశారు. అంకిత్, కరణ్ ఎయిర్పోర్టు వద్ద ఉన్న ఓ హోటల్లో దొరికారు. వాళ్లు బ్రేక్ఫాస్ట్గా పోహా తీసుకున్నారు. అంకిత్ గర్ల్ఫ్రెండ్ హోటల్లో రూమ్ బుక్ చేసినట్లు సమాచారం. హోటల్ వద్ద కరణ్ బంధువు మరొకరు 45 వేల నగదుతో దొరికాడు. అనేక మంది ఖైదీల ఐడీ కార్డులు అతడి వద్ద గుర్తించారు.
ఖైదీల పిక్నిక్కు రూ.25 వేలు ఖర్చయ్యాయని, ఓ మధ్యవర్తి వారికి కావల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. జైలు లోపల నుండే ఓ దోపిడీ దొంగ ఈ వ్యవహరానికి పథకం పన్నినట్లు జైలు వర్గాలు తెలిపాయి. జైపూర్ సెంట్రల్ జైలులో ఖైదీలు దొంగచాటుగా ఫోన్లు వాడుతున్నారని, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సహా పలువురు వీఐపీలకు జైల నుంచి 200కిపైగా ఫోన్ కాల్స్ చేసి, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. సవాయి మాన్ సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, జైపూర్ సెంట్రల్ జైలులో అవకతవకపై దర్యాప్తు, సోదాలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.