పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి నానాటికీ క్షిణించిపోతోంది. 1958 నుండి ఇప్పటి వరకు ఐఎంఎఫ్(ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) ఏకంగా 24వ బెయిల్ అవుట్లు ఇచ్చింది. అయినా కూడా పాకిస్థాన్ సరైన ఆర్థిక వృద్ధిని సాధించలేకపోతుంది. వాళ్ల ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇండియాతో యుద్ధానికి దిగుతాం అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ నవ్వులపాలవుతోంది. నిజాలు మాట్లాడుకుంటే.. పాకిస్థాన్ ఏ కొసానా కూడా ఇండియాకు పోటీ కానేకాదు. ఇండియాతో ఎందుకు కనీసం ఇండియాలో భాగమై ఓ రెండు రాష్ట్రాలతో కూడా పాకిస్తాన్ పోటీ పడలేకపోతోంది. పాకిస్థాన్ జీడీపీ(గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) కంటే కూడా ఇండియాలోని మహారాష్ట్ర, తమిళనాడుల జీడీపీ అధికం.
ఐఎంఎఫ్ తాజా డేటా ప్రకారం.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 2.6 శాతం వృద్ధి చెందింది, దాని జీడీపీ సుమారు 373.08 బిలియన్ డాలర్లుగా ఉంది. రాజకీయ అస్థిరత, అధిక ద్రవ్యోల్బణం, పేలవమైన చెల్లింపుల బ్యాలెన్స్ వంటి పునరావృత సమస్యలు పాకిస్తాన్ వృద్ధిని తగ్గిస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో భారతదేశ జీడీపీ దూసుకుపోయింది. పాకిస్తాన్ వృద్ధి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ వృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఇండియా ఒకటి. 2025 నాటికి భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 6.4 శాతం వద్ద ఉంది. ప్రస్తుత ధరల వద్ద దేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భారతదేశంలో కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడుల జీడీపీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) రూ. 42.67 లక్షల కోట్లు, తమిళనాడు GSDP రూ.31.55 లక్షల కోట్లు. మహారాష్ట్ర, తమిళనాడు రెండూ కూడా భారీ పారిశ్రామికీకరణతో దేశంలో కీలకమైన పారిశ్రామిక, ఆటోమోటివ్ కేంద్రాలుగా ఉన్నాయి. కాగా పాకిస్థాన్ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ రక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తూనే ఉంది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ను 16.4 శాతం పెంచి 7.37 బిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 60,655 కోట్లు) కేటాయించింది. ఇండియా 2026 ఆర్థిక ఏడాదికి గాను రక్షణ కోసం 81.72 బిలియన్ డాలర్లు (రూ. 6.72,556 కోట్లు) కేటాయించింది. ఇది గత సంవత్సరం కంటే 4.7 శాతం ఎక్కువ. ఇలా పాకిస్థాన్ జీడీపీ కంటే మన దేశంలో రెండు రాష్ట్రాల జీడీపీ అధికంగా ఉండటంతో మాతో మీకెందుకు యుద్ధం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పాకిస్థాన్ను ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..