అహ్మదాబాద్, ఆగస్ట్ 21: అహ్మాదాబాద్లోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని 8వ తరగతి విద్యార్థి కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ మర్డర్కు సంబంధించి నిందిత విద్యార్ధి, తన స్నేహితుడితో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. చెందిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అహ్మదాబాద్లోని ఖోక్రాలోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్లో మంగళవారం (ఆగస్ట్ 19)న 8వ తరగతి విద్యార్ధి.. అదే స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధిని కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన బాధిత విద్యార్ధిని ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ బుధవారం (ఆగస్ట్ 20) మృతి చెందాడు. పోలీసుల విచారణలో హత్యకు చెందిన చాటింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మర్డర్ తర్వాత కత్తితో దాడి చేసిన 8వ తరగతి విద్యార్ధి.. మరో స్నేహితుడితో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేశాడు. ఈ చాటింగ్లో క్రైంకు సంబంధించిన విషయాలు నిందితుడు తన స్నేహితుడికి చెప్పాడు. ఈ రోజు ఎవరినైనా కత్తితో పొడిచావా? అని స్నేహితుడు ప్రశ్నించగా.. చాటింగ్లో తానే పొడిచానని, అతడు చనిపోయాడని తెలిపాడు. అయితే కొట్టి వదిలేస్తే సరిపోయేది.. ఎందుకు చంపావ్ అని స్నేహితుడు అంటాడు. జరిగిందేదో జరిగిపోయిందని నిందిడుతు అంటాడు. అయితే ఈ చాటింగ్ డిలీట్ చేసి కొన్ని రోజులు అండర్గ్రౌండ్కు వెళ్లిపోవాలని మిత్రుడు సలహా ఇచ్చాడు. ఈ మర్డర్ గురించి నీకు ఎలా తెలిసిందని నిందితుడు అడిగాడు. దానికి ఆ స్నేహితుడు రోడ్డుపై ఒకరిని అడిగి, తెలుసుకున్నానని చెబుతాడు. వాడిని చంపానని నీకు చెప్పిన వాడికి చెప్పు.. అని నిందితుడు చాట్లో చెప్పాడు. వీరి చాటింగ్కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మరోవైపు స్కూల్ పరిసర ప్రాంతంలో ఈ మర్డర్ జరగడంతో.. భారీ స్థాయిలో విద్యార్ధుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. విద్యార్ధులకు నేర్పే క్రమశిక్షణ ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్కూల్లో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు దీనిపై స్పందిస్తూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జైపాల్ సింగ్ రాథోడ్ తెలిపాడు. మృతి చెందిన విద్యార్ధి 15 ఏళ్ల పదో తరగతి చదువుతున్న నయన్ అనే బాలుడని, దాడికి పాల్పడిన విద్యార్ధి 9వ తరగతి చదువుతున్నాడని తెలిపారు. విద్యార్థుల మధ్య వాగ్వాదం చివరకు హత్యకు దారి తీసిందని, సెవన్త్ డే అడ్వంటెస్ట్ స్కూల్లో ఈ హత్య జరిగిందని తెలిపారు. చంపుతానని నయన్ బెదిరించాడని, అందుకే 8వ తరగతి బాలుడు దాడి చేసినట్లు నిందితుడు చాటింగ్లో చెప్పాడు.
ఇవి కూడా చదవండి
నిందిత విద్యార్ధి దుష్ప్రవర్తనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అబ్బాయిలు దుర్భాషలాడటం, అశ్లీలమైన హావభావాలు చేయడం, బాలికలను వేధించడం, కత్తులు, ఫోన్లు తీసుకెళ్లడం, కంప్యూటర్ గదిలో పోర్న్ చూడటం వంటి దుష్ప్రవర్తనపై పాఠశాల అధికారులకు పదే పదే ఫిర్యాదు చేసినట్లు ఓ విద్యార్ధి తల్లి మీడియాకు తెలిపింది. గత రెండేళ్లుగా ఇలాంటి సంఘటనలు సెవన్త్ డే అడ్వంటెస్ట్ స్కూల్లో వెలుగులోకి వస్తున్నాయని, నేను రెండుసార్లు ఫిర్యాదు చేశానని, స్కూల్ బస్సులో అబ్బాయిలు అసభ్యకరమైన భాష మాట్లాడతారని ఆమె తెలిపింది. విద్యార్ధులపై కఠినమైన చర్యలు తీసుకోకుండా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం, వారి వద్ద లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పడం, ఆ తర్వాత విద్యార్థులను వదిలిపెట్టడం ఈ పాఠశాలలో సాధారమణమై పోయాయని ఆమె అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.