తిరుమల వెంకన్న దర్శనానికి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్య ప్రకటన చేసింది. శ్రీవారిమెట్టు వద్ద ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా టిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సాధారణంగా శ్రీవారి మెట్టు మార్గం నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు శ్రీవారిమెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. అయితే తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. శ్రీవారి మెట్టు నుండి కాలినడకన వెళ్లే దివ్య దర్శనం భక్తులకు టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి అక్కడే టోకెన్లు జారీ ప్రక్రియ కొనసాగనుంది. టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది. ఈ మేరకు తమ ఆధార్ చూపించి దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. శనివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. మరోపక్క ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారని టీటీడీ స్పష్టం చేసింది.
భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించి, టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూచించారు. శ్రీవారి మెట్టు వద్ద నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు టోకెన్ కౌంటర్ల తాత్కాలిక మార్పు అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విభాగాధిపతులను సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, టీటీడీ ఇన్చార్జి సీవీఅండ్ఎస్వో మరియు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్రాజు, సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎస్ఈలు శ్రీ మనోహరం, శ్రీ వెంకటేశ్వరులు, జీఎం(ట్రాన్స్పోర్ట్) శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ సెల్వం, శ్రీ గోవింద రాజన్, శ్రీ సోమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..