కామారెడ్డి, జూన్ 4: అభంశుభం తెలియని పసివాళ్లను కన్నోళ్ల కళ్లుగప్పి ఎత్తుకెళ్లి భిక్షాటన కోసం వినియోగించే ముఠాలు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో దందాసాగిస్తున్నారు. తాజాగా రెండేళ్ల పిల్లాడిని భిక్షాటన కోసం కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిఘా నేత్రాల సాయంతో కేవలం 3 గంటల్లోనే కేసును ఛేదించారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలానికి చెందిన మొక్కల నర్సింహులు, అతని భార్య, వారి రెండేళ్ల కుమారుడితో సిరిసిల్ల రోడ్డులోని ఒక దుకాణం వద్ద నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో లేచి చూసేసరికి వారి పక్కన పడుకున్న రెండేళ్ల కుమారుడు హర్షిత్ కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన దంపతులు చుట్టుపక్కల వెతికారు. కానీ ఎక్కడా పిల్లాడి జాడ కనిపించలేదు. దీంతో తాము నిద్రలో ఉన్న సమయంలో ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారని భావించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి నగరమంతా జల్లెడ పట్టారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఓ జంట నిద్రపోతున్న పిల్లాడిని ఎత్తుకెళ్లడం గమనించారు. ఫుటేజీ ఆధారంగా ఆ జంట కోసం వెతికిన పోలీసులు వారిని కామారెడ్డి రైల్వే స్టేషన్లో గుర్తించారు. పిల్లాడిని ఎత్తుకుని భిక్షాటన చేస్తూ ఆ జంట కనిపించింది.
విచారణలో నిందితులు దోమకొండకు చెందిన పల్లపు రాజు, శారదగా గుర్తించారు. భిక్షాటన కోసం తల్లివద్ద నిద్రిస్తున్న పిల్లాడిని కిడ్నాప్ చేసినట్లుగా నేరం అంగీకరించారు. పోలీసులు వారి వద్ద నుంచి బాబును స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును కేవలం మూడు గంటల్లోనే ఛేదించి.. బిడ్డను తల్లివద్దకు చేర్చిన సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీరామ్, బీసీలు విశ్వనాథ్ విజయరాజు నరేష్ రవి, అశ్వినిలను ఏఎస్పీ చైతన్య రెడ్డితోపాటు స్థానికులంతా పొగడ్తలతో ముంచెత్తారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.