ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి యత్నించాడు ఓ దుండగుడు. సివిల్ లైన్స్లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బహిరంగ విచారణ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి రాయి లాంటి వస్తువుతో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా బృందం, స్థానిక ప్రజలు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పబ్లిక్ హియరింగ్ సమయంలో, ఒక వ్యక్తి తన ఫిర్యాదుతో ముఖ్యమంత్రి వద్దకు వచ్చాడు. కానీ అకస్మాత్తుగా అతను ముఖ్యమంత్రిపై రాయిలాంటి వస్తువుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అసభ్యకరమైన భాషతో దూషిస్తూ.. దాడికి తెగబడ్డాడు. దాడి చేసిన వ్యక్తి వయస్సు దాదాపు 35 సంవత్సరాలు అని, అతని చేతిలో కొన్ని కాగితాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సంఘటన తర్వాత సంఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడికి ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా ఈ కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం రేఖ గుప్తాపై జరిగిన దాడిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా స్పందించారు. సీఎంపై జరిగిన దాడిని వీరేంద్ర సచ్దేవా తీవ్రంగా ఖండించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం నిజం బయటకు వస్తుందని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..