కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు గాను రూ.4.35 కోట్లు నిధులు కేటాయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి కమిటీ వేసిన టిటిడి అనేక కీలక అంశాలపై చర్చించింది. 58 అంశాల ఏజెండా తో సమావేశమైన పాలకమండలి వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయం రూ.10 నుండి 20 లక్షలకు పెంచింది. ఇక టీటీడీలో 142 కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు చేసింది. పాలకమండలి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ ఈవో లు మీడియాకు వివరించారు.
తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది.
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతవరణం పెంపొందించేందుకు నిర్ణయం తీసుకుంది.
తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసు కొన్నట్లు ఈవో స్పష్టం చేశారు. శ్రీవారిసేవ ను మరింత విస్తృత పరిచి భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు 4 కో ఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.ఇక శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది టిటిడి బోర్డు.
ఇవి కూడా చదవండి
తిరుమలలోని కళ్యాణకట్ట లో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అదే విధంగా తిరుమలలో పాత బడిన హెచ్వీడీసీ లోని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆంప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచన మేరకు తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
పదకవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళ్లపాక లో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని నిర్ణయం తీసుకుంది. సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్ల ను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క మైక్ సెట్ కు రూ.25 వేలు కేటాయించింది.
వేద పరిరక్షణ లో భాగంగా నిరుద్యోగులైన వేద పారాయణ దారులకు దేవదాయ శాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర దేవాదాయశాఖ సూచనల మేరకు శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు మూడు కేటగిరీలు గా విభజన చేసింది. మూడు కేటగిరీ ల్లో రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలు గా నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ తెలిపారు. ఇప్పటి వరకు ఒకే కేటగిరీ కింద రూ.10 లక్షలు చెల్లించే విధానం లో మార్పు తీసుకొచ్చినట్లు ఇవో చెప్పారు. హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లు గా పని చేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయం తీసుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.